Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 28

Viswamitra Celestial weapons to Rama- 2!

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

ప్రతిగృహ్య తతోsస్త్రాణీ ప్రహౄష్టవదన శ్శుచిః |
గచ్ఛన్నేవ చ కాకుస్థో విశ్వామిత్ర మథబ్రవీత్ ||

' శుచి అయి ఆ అస్త్రములను ప్రతిగ్రహించి ఆ కకుస్థవంశజుడగు శ్రీరాముడు సంతోషముగల వదనముతో పయనించుచూ విశ్వామిత్రునితో ఇట్లనెను'.

బాలకాండ
ఇరువది ఎనిమిదవ సర్గము
( విశ్వామిత్రుడు శ్రీరామునకు అస్త్ర ఉపహారమంత్రములను ఉపదేశించుట )

ఆప్పుడు కకుస్థవంశజుడగు శ్రీరాముడు శుచి అయి విశ్వామిత్రుడు ఇచ్చిన ఆ అస్త్రములను ప్రతిగ్రహించి ఆ సంతోషముగల వదనముతో విశ్వామిత్రునితో ఇట్లనెను.

' ఓ భగవన్ ! సురాసురులను గూడా ఎదుర్కొనగల అస్త్రములను గ్రహించితిని . ఓ మునిపుంగవా ! ఈ అస్త్రములను ఉపసంహరము గురించి తెలుసుకొనుటకు కోరికగలదు'.

ఈ విధముగా కకుస్థుడగు శ్రీరాముడు పలుకగా ఆ ధృతిమంతుడు సువ్రతుడు అగు విశ్వామిత్రుడు శుచి అయి ఉపసంహారమంత్రములను ఆ శ్రీరామునకు ఉపదేశించెను.

విశ్వామిత్రుడు మరల చెప్పెను.

' ఓ రామా ! సంహారక మంత్రములు ఇవి . సత్యవంతము, సత్యకీర్థి, ధృష్టం, రభసము , ప్రతిహారతరము అను పేరుగల పరాజ్ఞ్ముఖము అవాజ్ఞ్ముఖము; లక్షాక్షము, విషమము, ధృఢనాభము, సునాభము , దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము , శతోదరము ; పద్మనాభము, మహాబాహు, దుందునాభము, సునాభము . జ్యోతిషము, కృశనము, నైరాశ్యము విమలము అనబడు రెండూ; యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, శుచిబాహు , మహాబాహు,నిష్కులీ, అలాగే విరుచి, సార్చిమాలి, ధృతిమాలి , వృత్తిమాన్ , అలాగే రుచిరము; పిత్రుసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము , ధాన్యము ; కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము అలాగే ఝృంభకము, సర్వనాభము, సంతానము, వరుణము ; ఓ రామా !! ఇవి అన్నియూ సంహారక మంత్రములు. ఓ రాఘవా ! కామరూపులగు భృశాశ్వ తనయుల అస్త్రములను ఇచ్చితిని. నీవు ఉపసంహారక మంత్రములను కూడా గ్రహించుటకు అర్హుడవు. నీకు భద్రమగుగాక'.

అంతట ఆ కాకుస్థుడు అట్లే అని సంతోషముగా ఆ మంత్రములను స్వీకరించెను. అవికూడా ఆ రాఘవుని చేరెను. అవి దివ్యభాస్వర దేహములతో ఉన్నవీ , సుఖప్రదమైనవీ , కొన్ని అంగారసమానముగా నున్నవీ , కొన్ని ధూమముతో సమానమైనవిగా నున్నవీ , కొన్ని చంద్రునివలె నున్నవీ.

ఆ అస్త్రములు అన్నియూ అంజలిఘటించి శ్రీరామునితో మధురభాషణలతో అడిగిరి, " ఓ నరశార్దూలా! నీకు మేము ఏమి చేయవలెను ?" అని

శ్రీరాముడు చెప్పెను

' కార్య కాలములో నేను మనస్సులో తలచినవెంటనే నాకు సహాయము చేయుదురుగాక. ఇక మీరు మీ అభీష్ఠ స్థానములకు యదేచ్ఛగా వెళ్ళుడు' ఈ విధముగా ఆ రఘునందనుడు ఆదేశించిన పిమ్మట వారు "అట్లే" అని పలికి , ప్రదక్షిణమొనర్చి తమ యథాస్థానముకు చేరిరి.

పిమ్మట కాకుస్థుడైన శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని ఆదేశానుసారాము ఆ అస్త్రములను మరియూ వాటి ఉపసంహార మంత్రములనూ అన్నిటినీ లక్ష్మణునకు ఉపదేశించెను్.

ఆ రాఘవుడు ఆ అస్త్రములన్నిటినీ తెలిసికొని , మహాముని అగు విశ్వామిత్రునితో పయనించుచూ మధురమగు వచనములతో ఇట్లు పలికెను.

'ఓ ముని శ్రేష్ఠా ! ఈ పర్వత సమీపమునందు మేఘములను బోలి వృక్షసముదాయమేమి ? నాకు పరమ కుతూహలముగా వుంది.?ఇది వివిధ మృగములతో మనోరమముగా నున్నది. ఇచట నానావిథములైన పక్షుల కిలకిలారావములతో వీనుల విందుగా నున్నది. ఈ ప్రదేశము మిక్కిలి సుఖముగా ఉన్నది. మరియూ మనముఒక భయంకర వనమునుండి బయటపడినట్లున్నది. . ఓ భగవన్ ! ఈ ఆశ్రమపదము ఎవరిది ? నాకు సర్వము విశదీకరింపుడు'.

'ఓ మహామునీ ! పాపాత్ములు, బ్రహ్మహత్యలు చేయువారు మీ యజ్ఞమునకు విఘ్నములు కలిగించువారు వచ్చెడి ప్రదేశము ఏది ? నేను రాక్షసులను వధించి మీ యజ్ఞమును రక్షింపవలసిన ప్రదేశమేది ? ఇది అంతయూ వినుటకు కోరుచున్నాను'.

|| ఈ విథముగా బాలకాండలోని ఇరువది ఎనిమిదవ సర్గము సమాప్తం ||
|| ఓమ్ తత్ సత్ ||

రక్షితవ్యా క్రియా బ్రహ్మన్ మయా వధ్యాశ్చ రాక్షసాః |
ఏతత్సర్వం మునిశ్రేష్ఠ శ్రోతుమిఛ్ఛామ్యహం ప్రభో ||

తా|| ' నేను రాక్షసులను వధించి మీ యజ్ఞమును రక్షింపవలసిన ప్రదేశమేది ? ఇది అంతయూ వినుటకు కోరుచున్నాను'.

|| ఓమ్ తత్ సత్ ||


|| om tat sat ||